మునుపటి నా మాట
మూర్తిగారింటికి వెళ్ళాలి. అప్పుడే కదా అన్నాను.. వెళ్ళి మోహన రాగం ఆయన గళం నుంచి వినాలని. ఊరికే అప్పుడలా అన్నానా ...లేక గాంధీ గారే మున్నాభాయికి కనిపించి అతనితో అదేదో సినిమాలో మాట్లాడినట్టు నా చేత అనిపించారా? గాంధీ గారేమిటీ? మోహన రాగం ఏమిటీ? పొంతన లేని గొడవలా అనిపిస్తోందా? ఉంది- పొంతన ఉండబట్టే ఆలోచనలు పొంగి వస్తాయి. గాంధీ గారి పూర్తి పేరేమిటీ? మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ – అవునా? మహాత్ముడి పేరులో మోహన శబ్దం ఉంది కదా. కనుక మోహన రాగం ఈ పూట ఆలపిస్తే ‘మహాత్ముడే కలలు గన్న మరో ప్రపంచం’ అత్యంత మోహనంగా, మోహన కృష్ణుడు మురళి నూదినంత మనోహరంగా ఉంటుంది. మనిషిలో ఏది మోహనం? రూపా? నడవడికా? నన్నే కాదు నిక్సన్ ని అడిగినా, పాబ్లో నెరూదా నడిగినా, ఒబామా నడిగినా, ఒసాబిసా బృందాన్నడిగినా వచ్చే సమాధానం ఒకటే- కసాయి వాడిని సైతం మునిగా మార్చేసే బోసినవ్వు, ఆగిపోవడం కాదు సాగిపోవడమే లక్ష్యం అన్నట్టుండే చక చక నడక, దేశమాత స్వేఛ్చ కోసం కాయలు కాచే కళ్ళు, చిన్న అంగోస్త్రం చాలు సిగ్గు పడే ఈ దేహానికి అనేట్టు ఉండే కట్టు, తనని తాను తీర్చి దిద్దుకోవడానికి భగవద్గీత సాయం కోరే చేతులు, రేపటి చిరుగులకి విరుగుడు మంత్రం సూచించే చరఖా, గుండ్రటి విశ్వం లో కాంతి కిరణాలు దారి తప్ప కూడదని చూపించే కళ్ళజోడు ... వెరసి ఒక మానవుడు భూమ్మీద వెలిశాడు. అటువంటి ఏకైక మానవుడిదే మోహన రూపం. మోహనదాస కరంచంద్రుడిని మహాత్ముణ్ణి చేసిన రూపం.
0 Comments
ఎవరివి జనవరి చివరి తొమ్మిది రోజులు? ‘ఇదే నీ ప్రశ్న ఐతే బాలాజీ, నేను జనవరి ఇరవై మూడు నుంచి మొదలెట్టాలి’ ‘నేను చెప్పేందుకు ఇష్టపడే మూడు రోజుల గురించి నన్ను చెప్పనీ’ ‘అటులే కానిమ్ము’ ‘జనవరి ఇరవై మూడు ఉందే, అది బోసు బాబు జయంతి. పరాధికార ధిక్కారానికి హింసాత్మక తిరుగుబాటే సరియైన బాట అని నమ్మి ఆచరించిన సుభాష్ చంద్ర బోస్ ఆ రోజున పుట్టాడు. సుభాష్ అడుగుజాడలు ఎంతమందికి శభాష్ అనిపించాయో తెలియదు కానీ ఆ వీరుడి అదృశ్యం మాత్రం ప్రతి భాషలోనూ ‘అయ్యో, అరరే ‘ అనే రెండు మాటలకి ఆస్కారమిచ్చింది. ‘అతని బాట సరికాదు, అహింసా మార్గం తోనే పర పాలకుల్ని పారద్రోలొచ్చు’ అని తను నమ్మిన సిద్ధాంతాన్ని చివరి వరకు ఆచరించిన మహాత్మా గాంధి దేశమాతకు స్వేచ్ఛ దక్కిన అయిదునెలలకే ఒక మతోన్మాది హింసాత్మక చర్యకి బలి కావడం ఈ జనవరి ముప్ఫయినే జరిగింది. అప్పుడూ అంతా ‘అయ్యయ్యో, అరరే’ అనే అన్నారు. ఈ రెండిటి మధ్యగా వచ్చిన జనవరి ఇరవై ఆరు మనకి గణతంత్ర దినం. ‘ఆహా ఆహాహా’ అంటున్నాం. బోస్ 1945 లో అదృశ్య మయ్యేడంటారు. గాంధీ 1948 లో అమరుడయ్యాడు. గణతంత్రం మనకి 1950 లో అమలైంది. స్వాత్రంత్యం తరువాత వచ్చే కాలం వారిద్దరికీ దూరమైంది. ఇక నువ్వు చెప్పు’ ‘ఒక్కసారి మనం చూడని గతాన్ని గుర్తు చేశావు. కొన్ని వందల ఏళ్ళు అప్పటి యువతీయువకులు, పెద్దలు ఒకే దీక్షలో ఒకే పట్టుదలతో ఒకే గమ్యం వైపు దృష్టి సారించేరు. అది- దేశమాత స్వేచ్ఛ. అందులో ఎందరో త్యాగమూర్తులు సర్వం కోల్పోతే మరెందరో దొడ్డిదారిని పరభుజ కీర్తులై పోయి పేర్ల ముందు టైటిల్స్ సంపాయించుకున్నారు. పోనీలే- దేశ భక్తి గీతాల్లో త్యాగమూర్తుల్లో ప్రముఖంగా ఓ పదిమంది పేర్లే వినిపించేవి. కొన్నిటిని చరిత్ర పరిశోధకులు దాట వేశారు. అవునా కాదా గిరీ?’ |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|