మునుపటి నా మాట
‘వందే మాతరం’ అని పేపర్లో పెద్ద శీర్షిక, ‘వందే’ మాటని చిక్కని ఎర్ర రంగులో ముద్రించి మరీనీ. ఎందుకూ అంటే .. 09 సెప్టెంబర్ ఆదివారం నాడు ఈసురోమంటూ ఉండని శాస్త్రవేత్తలున్న మన ఇస్రో వారి నూరవ గ’ఘన’ వీధి విహారం విజయవంతమైంది కనుక. శ్రీహరికోట గట్టి మేల్ తలపెట్టితే శ్రీ కాళహస్తీశ్వరుడు ఎట్టి ఆపదా రాకుండా కాచాడు. అప్పుడనిపించింది ఇస్రో వారికి ఈ ‘వంద ...ఏ మాత్రం?’ లక్ష్యసిద్దిలో వెయ్యికి చేరగలరని! అందుకే ప్రస్తుతానికి ఎస్వీ రంగారావు ..అదే ..మన సినీ ఘటోత్కచుడు అన్నట్టు ‘వెయ్యి వీరతాడు’. -------- టీవీలో మళ్ళీ వీకెండు కోలాహలం ఓ వీశెడు. ఎందుకూ అంటే...అమితాభ్ బచ్చన్ మళ్ళీ కరోడ్పతుల్ని సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు కనుక. తాతగారైన ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఒక బుజ్జిపాపతో టీవీ షోలో ఆడుకున్నారట కూడా. పృథ్వీ రాజ్ కపూర్, రాజ్ కుమార్, సంజీవ్ కుమార్, అమితాభ్ బచ్చన్, శత్రుఘ్న సిన్హా, ఓంపురి, అమ్రీష్ పురి ల నటనతో పాటూ ఆకట్టుకునేది వారి వారి వారేవా అనిపించే వాచకం. అలా భేషైన మాటల వల పన్ని అమాంతం తెలుగువారిని దోచేసిన ఏకైక భారీ జీవి మన యశస్వీ రంగారావు గారొక్కరే. ఆ రోజుల్లో టీవీలుంటే తప్పక మన రంగారావు గారు ‘ఎవడురా కోటీశ్వరుడు?’ అనే కార్యక్రమం బుల్లి తెర మీద చూపేవారేమో. నేపధ్యంలో ‘ధనమేరా అన్నిటికి మూలం’ అని ఒకే ఒక్క లైన్ వినపడేదేమో, అన్నిటికి ధనమే మూలం కాకపోయినా. హఠాత్తుగా రంగారావు గారు గుర్తుకు రావడం ఏమిటీ? జయంతి గానీ వర్ధంతి గానీ వస్తోందా? కొందరంతే.. వారికివేవీ చెల్లవు. నిత్య స్మరణీయులు. ------ ఇప్పుడు ఎటు విన్నా ఒకటే నామం – శిరిడీ సాయి! నాగార్జున సినిమా.. రాఘవేంద్రరావు సినిమా .. కీరవాణి సినిమా.. ముఖ్యంగా మహేంద్ర రెడ్డి సినిమా. కుటుంబ సమేతంగా సినిమా చూసి వస్తుంటే కాస్త ఇన్నాళ్ళకి మనసునిండా ‘రెట్టించిన హాయి’ దట్టించినట్టయింది. ‘నీకెట్టుందో కాని’ అని ఒక పాత పాటలో అన్నట్టు మహారాష్ట్రలోని తెలుగువాళ్ళ మైన మాకు హాలు సమీపించగానే తెలుగు ముఖాలు కనిపించడం మటుకు హాయీ ముప్పావే. ఈ హాయి ఎంత పని చేసిందంటే ఇంటర్ వెల్ లో హాలు బయట నున్న అమ్మకాల స్టాల్ కుర్రవాడిని ‘ రెండు కాఫీలు ఇవ్వు బాబూ’ అని తెలుగులో అడిగేంతవరకూ వెళ్ళింది. తెలుగు తెలియని ఆ అబ్బాయి ఆదిత్య 369 లో చంద్రమోహన్ ‘ మీరంటున్న మాటల్లో ఒక్క పొట్టా, పొట్టి తప్ప నాకేవీ అర్థం కావట్లేదు’ అన్నట్టు మొహం పెట్టి ఒక్క కాఫీ అనే మాటనే అర్ధం చేసుకునీ మనల్ని వెర్రి గా చూడటం! అది హాయీన్నర. సినిమాలో సాయిబాబా ఇంగ్లీష్ మాట్లాడం హాయీమ్పావు. -------- యువి అనగానే అల్ట్రా వాయిలేట్ కిరణాలు అనుకునే అమాయకులుండరు ఇండియాలో, అదీ ఈ రోజుల్లో. ఎవడిక్కావాలి రేడియేషన్ , ముందుండగా క్రికెట్టు మెడిటేషన్! ‘యువరాజ్’ ని ముద్దుగా ‘యువి’ అని పిలుస్తారని కడుపులో ఉన్న బిడ్డ కూడా కాలు తన్ని మరీ చెప్పగలదు. క్యాన్సర్ రక్కసి నుంచి ముక్తి పొంది కాలుణ్ణి జయించి మళ్ళీ మైదానంలో అడుగు పెట్టిన యువికి విశాఖ ..‘పట్టం’ కట్టి బహుమతీ ప్రదానం చేసి అనంతరం ఆయన ఆడితే చూద్దామనుకుంది. ఇంతా చేస్తే మేఘావృతమై బెదిరించిన ఆకాశం ఆఘ మేఘాల మీద వాన కురిపించి ఆశ నిరాశ చేసింది. కాదు.. ఆంధ్ర ఆకాశం కురిపించిన ఆనంద బాష్పాలేమో అవి. బంతులబ్బాయి మీద ప్రేమతో మంచుకణాల పూబంతులు విసిరేసిన స్ఫటిక పుష్పాలేమో అవి! ----------
0 Comments
జూన్ 17...జూన్ 15....జూన్ 13 అలా చదువుతూ పోతుంటే కేలండర్ రెండేసి రోజుల తేడాతో వెనక్కి పోతున్నట్టు అనిపించడం సహజం. కాల గమనంలో ఒక్కసారి జ్ఞాపకాల దారుల్లో ఆగి వెనక్కి చూస్తే ఆ మూడు రోజులు మన మధ్య లేని మహా పురుషులు ముగ్గురుని గుర్తు చేస్తాయన్నది నిజం. జూన్ పదిహేడున ‘అచ్చ తెనుగుభాష’ పుట్టింది, ఎప్పుడూ, 1905లో. జూన్ 15 న ‘విప్లవ భాష’ కనుమరుగైంది, ఎప్పుడూ, 1983లో. జూన్ 13న ‘గజల్ షాయరీ భాష’ మరో రూపంలో మూగ బోయింది, ఎప్పుడూ ... మొన్న మొన్ననే. అచ్చ తెనుగు భాష కి తెలుగువాళ్ళు పెట్టిన ముద్దు పేరు – మల్లాది రామకృష్ణ శాస్త్రి . విప్లవ భాష తెలుగు వాళ్ళకి నేర్పిన పెద్ద పేరు – శ్రీరంగం శ్రీనివాసరావు. ఇక్కడ దేశం లోని రాజస్తాన్ లోని ‘లూనా’ లో పుట్టి, పొరుగు దేశానికి వలస పోయి కుస్తీ పట్టు తో పాటు పట్టుదలతో గళం సవరించి ‘గజల్ షాయరీ’ భాషకొక రంగు, రుచి, వాసన ఉంటుందని తెలియజేసిన గాయక శిఖామణి పేరు- మెహదీ హస్సన్. మల్లాది వారి తెలుగు కరువై దాదాపు యాభై ఏళ్ళవుతోంది. మహాకవి కదిలించిన సాహితీ విప్లవ రధం ఆగిపోయి ఇంచుమించు మూడు దశాబ్దాలౌతోంది. 'మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే' పాట పాడుకుంటూ ఆచార్య ఆత్రేయ 'ప్రేమ నగర్' లో ప్రవేశిస్తున్నారు. అక్కడ కొంత దూరంలో 'అనురాగం' కాలనీ లో ఉంటున్న మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి చెవిని పడ్డాయి ఆ మాటలు. 'ఇక్కడి కొచ్చేశాక ఇంకా మనసు-- మనిషీ అంటూ ఏమిటోయ్ ఆత్రేయులూ?' అంటూ సిల్కు పంచె, లాల్చీ దాల్చిన మరు మల్లె పువ్వంటి శాస్త్రి గారు నవ్వేశారు. 'అయ్యా.. నేను మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చి వచ్చి ఈ స్వర్గ సీమ లో పడ్డాను. అదీ ఈ సెప్టెంబర్ నెలలోనే. అదీ ఒక్క రోజు తేడాలో. ఎటొచ్చీ మరీ షష్టిపూర్తి చేసుకునీ ఇహ చాల్లే అని మీరు తనువు చాలించేరు. నేను ఇంకొన్నాళ్ళు నా మహా కాయాన్ని, తెలుగు పాట అనే మహా గాయాన్ని మోసుకొచ్చేను.' 'అవును కదూ. నేనా- సెప్టెంబర్ 12 న , నువ్వా 13 న , ప్చ్ ! అయినా తెలుగు పాట అనే మహా గాయం అంటావేం? తెలుగు వారి చేత తన్నులు తినడం ఖాయం!' 'కాకపొతే ఏమిటి చెప్పండి శాస్త్రి గారూ. మీతోనె తెలుగు పాట కదా - అది మీరు లేక ఎటూ దిక్కు తోచక జ్వరం తెచ్చుకునీ సంధి ప్రేలాపన చేస్తూ వచ్చి ఇంక లాభం లేదని కోమాలో పడిపోయింది' 'కోమా నయం కదా, కామా కన్నా' 'కామా వే, కోమా కాదు. ఎందుకంటే సంధి ప్రేలాపన మరీ హెచ్చయ్యింది' 'పోన్లేస్తూ. ఎవరి తరం వారిది.' 'మీరు రాసిన కథలు, మీ పాటలు మళ్ళీ మళ్ళీ చదివిస్తేనే గానీ తెలుగు బాగు పడదండీ' 'అన్నగారు సముద్రాల ఎంతో బిజీ గా ఉంటుంటే కొన్ని పాటలు రాశానని, నిజం చెప్పండనీ ఎందరో నిలదీసే వారు. మీ పేరెందుకు రాలేదు అని గొడవ చేసారు. పోనీ ఇద్దరి పేర్లూ చేర్చవచ్చు కదా అని గొణిగే వారు. ఇదంతా ఎందుకు. పోనీ నువ్వన్నట్టు నాదేదో వేరే తెలుగనుకుంటే దాన్ని పట్టుకునీ నా రచనలు పోల్చుకోవచ్చునే!' 'సముద్రాల వారు చక్కని ప్రాసలు వేస్తారు. మీరు కమ్మటి పదాలు రాస్తారు. ఇదే తేడా. ఇవి రెండూ కలబోసి ఆరుద్ర తన ముద్ర బయట పెట్టేడు. ఇక నేనంటారా-- నేను ఏది రాసినా 'మనసు' పెట్టి రాస్తానని ఒక నమ్మకమేర్పడి పోయింది తెలుగు ప్రజకి. నన్నేకంగా 'మనసు కవి' అన్నారు. అంటే అనననీండి కానీ నేను మాత్రం మిమ్మల్ని 'మన కవి' అంటాను. అంటేమనిషికి నచ్చిన కవి అని.' |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|