మునుపటి నా మాట
అంతే కదా.. మనం వేసే ఆ అద్భత నూలు పోగే ‘చంద్ర హారం’ ..... పుడమి మీద నెలబాలుడు పుష్కల మైన వెలుగులు నింపేందుకు డిసెంబర్ 4న దిగుతున్నాడు. రెండు రోజుల క్రితమే అమావాస్య చీకటి లాంటి గర్భ సంచిలో ఉండి బయట పడేదెప్పుడా అని ఆశతో ఎదురు చూశాడు. సముద్రుడు ‘వారసత్వం’ సరే... ‘వంశోద్ధారకుడు’ రాబోతున్నాడని సంతోషిస్తున్నాడు. ------- ‘పెద్దక్కయ్య’ ‘లక్షమ్మ’ రాబోతున్న ‘రక్త సంబంధం’ తలచుకుంటూ పొంగి పోతోంది. ‘నన్న తమ్మ’ అని కన్నడంలో మురిసి పోతోంది. ‘తల్లిదండ్రులు’ ‘చంద్ర వంక’ చూసి అమ్మాయ్ ..వీడికి మన ‘సొంత వూరు’ ‘పల్లెటూరు’ లో ‘చుట్టరికాలు’ వెతికి ‘మేనకోడలు’ ని ఎత్తుకొచ్చి ‘పెళ్లి చేసి చూడు’ అని తనకే పెద్ద బాధ్యత అప్పగించే ఆ ‘రేపు నాదే’ కదా అని గర్వ పడుతోంది. ‘మంచి మనసుకు మంచి రోజులు’ అంటే ఇదే కాబోలు అనుకుంది.
1 Comment
ఎవరండీ రాజా సాబ్? ఏ సీమ నేలిన దొరలు వారు? ఎవరండీ రాజా? ఏ రాజ్యంలో సిరులు దొరలించిన వారు? ఎప్పుడైనా ‘శభాష్ రాజా’ అని ఎంతమంది చేత అనిపించుకున్న వారు వీరు? అప్పుడప్పుడైనా ‘రంగేళీ రాజా’ అని వెనకన చేరి వెక్కిరించిన ఏ నలుగురి దాడికో గురైన వారా వీరు ? రాజా అంటే తన రాజ్యం పట్ల, తన జాతి పట్ల అంకిత భావం ఉన్నవాడే ..వీరు అటువంటి వారా? రాజా అంటే రాగం, భోగం రంగులని జనం, జాగృతి వెలుగులని నమ్మి పాలించే వాడే...వీరు అలాంటి వారా? ఓహో...వీరిది ఊహా సామ్రాజ్యమా? అహో...వీరిది స్వప్న పరిపాలనమా? ఊహా సామ్రాజ్యమైతే గగన విహారి కావాలి వీరు. ‘నెలరాజా’ అని పేరు పొందాల్సిన వారు వీరు.. అమవస నిశినే తప్ప నెల పొడుగునా అంతో ఇంతో సూర్యుడినుంచి సంపాదించుకున్న వెలుగుని భూమాత సంతతికి పంచిపెట్టాలనే తపన ఉన్నవాడు కనకనే చిమ్మ చీకటి గగన సామ్రాజ్యానికి ‘వెన్నెలరాజా’వారు వీరు. ‘లే యెన్నెల ఇరజిమ్ము’ సందమామ నావోడు ఉండగా నా గృహమే కాదా ‘స్వర్గసీమ’ అని ఎలుగెత్తి చాటే జనపదం సంతోషాన్ని నిత్యం చూస్తూ అమవాస్యలో తన ఆయు దోషాన్ని దాచేసి మళ్ళీ ‘పాదయాత్ర’ చేపట్టే నిజమైన రాజా వారు నెలరాజా వారు. ‘మాస్టారూ...భరత ఖండంబు చక్కని పాడి యావు ..అనే పంక్తి వరకు చాలనుకునీ చిలకమర్తి వారి పద్యంతో ఇవాల్టి మన సంభాషణ ప్రారంభిస్తూ మీ చిలుక పలుకులు వినాలని ఉంది.’ ‘మంచిది బాబూ.. గోమాత లాంటి అమాయక జీవి, శ్రామిక జీవి మన దేశం. గోమాతని పూజించాలి. దేశ ప్రజలంతా హాయిగా జీవించాలి. సుశీలమ్మ ‘చెంగు చెంగునా గంతులు వెయ్యండి’ అని ఆవుదూడల నుద్దేశిస్తూ పాడితే ‘వినరా వినరా నరుడా’ అని గోమాతనై పోయి నేనూ ఒక పాట పాడాను. రెండు గీతాలూ మన కొసరాజు రాఘవయ్య కవి గారి రచనలే అనుకుంటాను. అలాగే కరుణశ్రీ వారి ‘గోఘోష’ పద్యాలు పాడాను. గురజాడ వారి కన్యాశుల్కం నాటకాన్ని చిత్రంగా మలచినప్పుడు వారి పూర్ణమ్మ కథని బుర్రకథగా వినిపించానా..అందులో ఆవులు, మొదవులు అనే మాటలు దొర్లాయి. నిజానికి ఆవులు,పెయ్యలు అని ఉండాలి. వారు అలాగే రాశారు. విజయనగరంలో నా సంగీత శిక్షణ కావడం వల్ల ఆ మాండలీకంలో దూడల్ని పెయ్యలు అంటారని తెలిసినా సినిమాలో ఈ మార్పు ఎలా జరిగి పోయిందో తెలియదు. మళ్ళీ చాలా ఏళ్ళ తరువాత సుశీలమ్మ పాడిన ఇదే పూర్ణమ్మ కథలో పెయ్యలు అనే మాటనే ప్రయోగించారు. సంతోషం. మాండలీకాలు కవుల పాలిట కామ ధేనువులు! సరే..ఇక నన్ను మాత్రం ‘పలుక రాదటే చిలకా’ అని జెండరు మార్చేయొద్దు బాబూ..’ ‘అయ్యయ్యో ..ఎంత మాటండీ.....ఏదో చిలకమర్తి వారు అంటూ యతి ప్రాసలతో మతి పోయి చిలక పలుకులు అని అన్నాను .... అయినా మీరు గోరొంక అవతారమెత్తి మాకో చక్కని పాట వినిపించారు కదండీ.. అవన్నీ రప్పించాలి మీ నుంచి. అదీ నా ఎత్తుగడ. మీరు చూడండీ.. దేశం అనగానే ఎంచక్కా మన గురజాడ వారిని స్మరించుకున్నారూ... ఆయనొక్కరే బహుశా దేశాన్ని మట్టిగా కాక మనుషులుగా అభివర్ణించింది. అందుకే దేశాన్ని ప్రేమించమన్నారు, అంటే మనుషులంతా ప్రేమగా ఉండమనేగా?’ ‘అసలు రిపబ్లిక్ డే అనే కాదండీ, దేశంలో ఏ పండగొచ్చినా ఆ రోజు కన్నా మూడు రోజుల ముందరి నుంచే పండగ హడావుడి టీవీల్లో కనిపిస్తుంది. ఆ పండగని గుర్తు చేసే సినిమాలు ఊ తెగ వచ్చేస్తాయి. మీ కాలం నాటివి కాని రోజాలు, పాండేలు, నాయక్ లు, ఐ లవ్ మై ఇండియాలు కనిపిస్తుంటాయి,వినిపిస్తుంటాయి. గత వారం చెప్పినట్టు ఎవరెంత ముందర చూపిస్తే టీవీలకంత ఘనత అన్నమాట. మరి ఇవాళ రిపబ్లిక్ డే నాడు మీతో పొద్దుటే ముచ్చట్లాడుతుంటే టీవీ ధ్యాస లేదాయె! మీ పాటలు కనీసం ఒకటీ అరా వస్తాయో రావో? అర – అని ఆశ్చర్య పోతున్నారా? అంతే లెండి – సగం పాట వేస్తేనే ఎవ్వరూ రికార్డింగ్ చేసుకోరని అలా చేస్తుంటారు. అంతా కాపీ చేస్తున్నా ఎవరి రైట్ లు వారివి. అలా టీవీల పుణ్యమా అని ఏ రోజు ఏ పండగ అన్నది జనావళికి ఇట్టే తెలుస్తోంది. నా భయం అల్లా ...ఎక్కడ మీ పాటలు ఇంకొకరికి, ఇంకొకరి పాటలు మీకు సమర్పిస్తారేమో అనే. ఇప్పుడు నేనన్న అల్లా అన్నది తెలుగు పదమే (నేను రాస్తున్నప్పుడల్లా దీవించు భగవాన్). అయితే నిన్న (ఈ ఏడాది జనవరి ఇరవై అయిదున ) ‘ఈద్ ముబారక్’ అని మన దేశంలో ఉన్న మా చిన్న మిత్రుడు ఆలీ గారికి, విదేశంలో ఉన్న మా పెద్ద మిత్రుడు హకీమ్ గారికి చెప్పి ఇలా ఈ రోజు మీతో సంభాషిస్తుంటే చప్పున గుర్తొచ్చింది-‘ఒకే కుటుంబం’ చిత్రంలో ఒకనాడు మీరు పాడిన ‘అందరికి ఒక్కడే దేవుడు’ అన్న పాట. దాశరథి వారి కలం, కోదండపాణి గారి స్వర మేళనం, మీ ‘ఎన్టీఆర్’ గాత్రాభినయం – ఒక త్రివేణీ సంగమం. మూడు ధర్మాల మిశ్రమం ఆ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు (ముందు తమిళంలో, తరువాత చాలా ఏళ్ళకి తెలుగులో) మన ‘రక్త కన్నీర్’ నాగభూషణం గారు. ‘ఏమిటోయ్ గోపాలా, డబ్భై రోజులూ నా మీదే జాలి చూపాలా? ఊరికే నన్ను ఆకాశానికి ఎత్తెయ్యడం మానేసి అసలు సంగతి చెప్పు ... ఈ శీర్షిక దేన్నో తలపిస్తోంది’ ‘కనిపెట్టేశారే మాస్టారూ.. సంగతులంటారా...అవి మీ వంటి ఉత్కృష్ట సంగీత సామ్రాట్టులకే గానీ ఉత్తుత్తి మాకెలా సాధ్యమో చెప్పండి. ఆకాశంలో ఉండిపోయారు గానీ ఇదిగో ఈ ఉదకం ...పాద్యంగా అందించి మీ పాదాలు కడగాలని నాలాగ ఎందరికో ఉందండీ. ఆంధ్ర సంగీత కుమారా జయోస్తు మీకు!’ ‘ఇదిగో మళ్ళీ అదే మాటా? కనిపెట్టాననే అంటావ్...కనులకి చూపెట్టవేం?’ ‘చూప సాధ్యం కాదండీ మాస్టారూ..వినిపిస్తానంతే. అప్పుడు గుర్తిద్దురు గానీ.. ఈలోగా సరదాగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వెయ్యోచ్చా అండీ? ‘వెయ్యోచ్చా అని వెయ్యి ప్రశ్నలు అడిగేవ్ ..వద్దు బాబూ అన్ని!’ ‘అబ్బే ..మూడంటే మూడే నండి..’ ‘నీకు మూడ్ వచ్చిందని తెలుస్తూనే ఉంది బాబూ... ప్రశ్నలు మూడే అని అనుకోమంటావా?’ "నమస్కారం మాస్టారూ...ఇవాళ భోగీ పండగ. రేపు సంక్రాంతి. తరువాత కనుమ!" మూడు పండుగల ముచ్చట్ల మధ్య మన అందరి ఇళ్ళల్లో సుఖశాంతులు వర్ధిల్లాలని నా ఆశ బాబూ.. "మాస్టారూ... మిమ్మల్ని ఇలా తలుచుకోగానే పాట రూపంలో ప్రత్యక్షమైపోతున్నారు కదా.. కొందరికో కోరిక కలిగింది. ఈ చలికాలం సందర్భంలో మాస్టారి పాటల్లో ఎంచి మరీ ‘చలి’ పాటలు ఇవ్వొచ్చు కదా అని. ఒకరైతే మీరు ఆస్తిపరులు సినిమాలో పాడిన చలి చలి చలి వెచ్చని చలి .. పాట కావాలని అడిగారు. అసలు మీ పాటలే ఒక ఆస్తి. చలికి వణికినా, వేడికి ఉస్సురనినా, వానలో తడిసినా, దప్పిక కలిగినా...ఒక్కొక్క అనుభవానికి ఒక్కొక్క పాట అమర్చుకుంటూ పోతూ ఆ సంపదకి మురిసిపోయే వారంతా ఆస్తిపరులే." మహానుభావుడు ఆత్రేయకి చలి వెచ్చగా తోచినట్టే మహాకవి శ్రీశ్రీకి నీడ వెచ్చగా తోచింది. ఒక బెంగాలీ గీతం వరసలో నా హృదయంలో నిదురించే చెలీ ...అనే పాట రాసిన శ్రీశ్రీ గారు ఒక చోట ‘నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ’ అని అంటారు. అలా రెండు వెచ్చని పాటలు నా చేత పాడించారు, మాన్యులు మహదేవన్, రాజేశ్వరరావులు. మాస్టారూ.. కొత్త సంవత్సరం 2013 రానూ వచ్చింది. కాని గత ఏడాది డిసెంబర్ నెలలో యుగాంతం పెట్టిన భయం కన్నా అమానుష త్వం కలిగించిన జుగుప్స మరచిపోలేనిది. పుణ్యభూమి నా దేశం అని మురిసిపోతున్న దేశంలోనే, దేశ రాజధానిలోనే మానవత్వం తలదించుకునే సంఘటన జరిగింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఆరు పదులు దాటినా స్త్రీ పట్ల పురుషుడు గొప్ప స్వతంత్రుడై పోతూ చూపిస్తున్న హేయమైన, అనాగరికమైన, హింసాత్మక ధోరణి రవంతైనా సమసిపోలేదు. డిసెంబర్ పదహేడున డిల్లీ లో రాత్రి వేళ ఒక కన్య జీవితం తల్లడిల్లింది. అరిషడ్వర్గానికి ఒక్కొక్క ప్రతీక అన్నట్టు ఆరుగురు కీచకుల బారిని పడి ఆమె దారుణమైన అత్యాచారానికి గురైంది. ....చెప్పలేను మాస్టారూ... చెప్పకూడదు ....గాయపడిన హృదయాలను జ్ఞాపకాలే అతుకునోయ్ అన్నారొక కవి. కాని గాయపడిన ఆ కన్య జ్ఞాపకాలు మా హృదయాల్ని ఇంకా ఇంకా ముక్కలు చేస్తున్నాయి... ఆ మరుసటి రోజే ఉవ్వెత్తున లేచింది ప్రజా వెల్లువ.. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. .. ప్రభుత్వ మెతకతనం మీద, పోలీసు సుషుప్తావస్థ మీద రాజధానిలో గొంతులు ఏకమై పెట్టిన కేకల వెనక న్యాయ విచారణ పలాయనం సాగించలేక పోయింది. మానవత్వం నమ్ముకున్న వారంతా ఆడా, మగా,పెద్దా, చిన్నా అనే భేదం లేకుండా అంతటా కదిలి వచ్చారు. ఆ నరరూప రాక్షసులకి మామూలు శిక్ష చాలదు.. ఉరితీత ఒక్కటే మార్గం.. ఏ నోట విన్నా ఇదే తీర్మానం. సఫ్దర్జంగ్ నుంచి సింగపూరు వరకు పన్నెండు రోజులు సాగిన ఆ జీవచ్ఛవం లోని కొన ఊపిరి సమాధానం లేని సూటి ప్రశ్నలు వేసి ఇరవై తొమ్మిదవ తేదీని శాశ్వతంగా ఆగిపోయింది. ఆమె అసలు పేరుతో పని లేదు. ఆమె ఒక సగటు భారతీయ మహిళ. నిర్భయ, దామిని, అమానత్, Delhi brave heart, Daughter of India – ఎవరెలా పిలిచినా పలకలేదు ఆమె. యుగాంతం ...యుగాంతం అని దేశవిదేశాల్లో ఎందరో గొంతులు చించుకున్నారు, కొందరు సరదాగా, మరికొందరు నిజంగానే భయపడుతూనే. మాయన్లు (మయన్లు) ఏదో పాపం వాళ్ళ పూర్వీకులు లెక్క కట్టి చెబితే మిగతా వారంతా ఈ ‘జగమే…. మాయ కావడం’ ఖాయం అనుకున్నారు. ‘ఖాయము కాదిలన్ మనుజ కాయము’ అన్నారు కరుణశ్రీ కవిపుంగవులు. అయితే గియితే మనిషికే గాని ఈ ఇలకేదో ముంపు ఉందని ఎవరూ అనుకోరు. ఇంతకీ మాయన్లు ఏమన్నారూ? 21-12-2012 నాటికి 5,125 సంవత్సరాలు పూర్తయి ఒక శకం ముగుస్తుంది అనేగాని మొత్తం మానవ జాతి అంతరిస్తుందని కాదు. అంతెందుకూ, సరిగా మన పంచాంగం మనం తిరగేస్తే మనకి కూడా ఈ ఏడాదికి 5,113 కలియుగ సంవత్సరాలు ముగిసాయని తెలిసేది. అసలు మన కలియుగ కాలం ఎంత? 4,32,000 సంవత్సరాలు. అబ్బో—ఎంత దూరమూ అది ఎంత దూరమూ ! కాలం గురించి చెబుతూ దూరం దూరం అనడం ఘోరంగా లేదూ? కాలమే ‘దూరం’ అవ్వడం ఒక కాంతి సంవత్సరానికే సాధ్యం. మరో వారంలో మననుంచి దూరం అవుతుంది ఈ యేడు. మరో కొత్త వత్సరం, అదో కొత్త ఉత్సాహం. ఎన్నో కాంతులు, ఎన్నో చీకట్లు కలబోసుకుని ఒక్కొక్క సంవత్సరం వస్తుంటుంది. శ్రీవేంకటరమణ – ఏడుకొండల సాక్షిగా ఏడక్షారాల ఆంధ్ర దేవుడు, తెలుగువారి ఇలవేల్పు. వెంకటేశ్వరరావు – కూడా అంతే..అదే ఏడక్షారాల ఆంధ్రుడు, తెలుగువారికి మరో రకంగా వేలుపు. అలా చెప్పే కన్నా ‘పద్మశ్రీ ఘంటసాల’ అని మార్చితే, అవీ ఏడక్షారాలై ఒద్దికగా ఉండి, బొద్దుగా ఉండి ఏడు స్వరాల రూపం దాల్చి ‘తెలుగువారి గళవేల్పు’ రూపంగా పరిచయమైపోవూ? అంతా ఆ ఏడుకొండలవాడి లీల అని అనుకుంటే లీల అనే మలయాళం మాతృభాషైన గాయని ఎంచక్కా తెలుగు వారికి తన సుస్పష్ట నవ్య దివ్య గాత్ర ‘సుమ’ పరీమళం అందించారూ.. అలా ఆమెను పరిచయం చేసినది ఘంటసాల వేంకటేశ్వరుడే! (సావిత్రి నటనకి జానకి స్వరాలా అని సంశయించే వారికి ‘తనకన్నా జానకి బాగా పాడుతుంది ఇలాంటి స్వర రచన’ అని ‘నీ లీల పాడెద దేవా’ పాటని జానకికి అందేలా చేసిన లీల గొప్పతనం సంగీత ప్రపంచానికి ఒక ధర్మ ప్రవచనం. కాకతాళీయంగా ప్రాసకవి ఆరుద్ర రాసిన ఆ పాటలో ‘లీల’గా పదం పడడం ఏడుకొండలవాడి లీల! ఆ పాట జానకి సంగీత గగనంలో వెన్నెలలు తీసుకొచ్చింది. అసలు వెన్నెల మహిమలు ‘లీల’గా తెలియడం అన్నది పింగళి వారి లీల. సావిత్రికి లీల నేపధ్యమే సరి తూగేది అని నిర్ధారించుకున్న రోజులవి కనుక చిత్రంలో నటించబోయి తప్పుకుని ‘మిస్సమ్మ’ అయిపోయారు భానుమతి . ఏమిటో ఈ మాయ.. అంతా నాగిచక్రనాగేంద్ర మాయ!) ‘నమస్కారం మాస్టారూ ... మీకు తొంభై ఏళ్ళు..’ ‘అవునా బాబూ... భూమ్మీద ఉంటే కదూ .స్వర్గ సీమలో ఈ గంధర్వ లోకంలో వయో పరిమితులు లేకుండా సుఖంగానే ఉన్నాను’ ‘మాస్టారూ.. భూమ్మీద సుఖపడితే తప్పు లేదురా అని మీరన్నారు. అదే.. పాడారు. కానీ మీరు లేక ఈ భూమ్మీద మాకేం సుఖం ఉందనీ? 1944 లో స్వర్గసీమ సినిమాలో తొలిసారిగా నట గాయని, బహుముఖ వరదాయిని భానుమతి గారితో యుగళ గీతం పాడి ..’ ‘అవును అలా సినిమాల్లో గాయకుడిగా అడుగు పెట్టాను. అప్పటికి నా వయసు ఇరవైరెండేళ్ళు’ ‘చిన్నవయసులోనే, సినీసీమలో ప్రవేశిస్తూనే గాయకుడిగా ఉంటూ సంగీతదర్శకత్వ బాధ్యతలూ భుజాన వేసుకోవడం మీ వంటి ప్రజ్ఞావంతులకే సాధ్యం. కాని మా బాధల్లా మీరు అయిదుపదుల వయసు చాలనుకునీ స్వర్గసీమకి వెళ్లిపోవడం’ ‘అంతా ఆ ఏడుకొండలవాడి నిర్ణయం బాబూ..మూడు దశాబ్దాలు అన్ని రకాల పాటలు పాడాను, స్వరాలూ సమకూర్చాను ......అది చాలు బాబూ..’ ‘మల్లాది రామకృష్ణ శాస్త్రి కవి గారు ఏడుకొండలవాడిని తెలుగు వారి ఇలవేల్పుగా కీర్తించారు. మేమంతా ముక్త కంఠంతో మిమ్మల్ని తెలుగువారి గళవేల్పు అని నిత్యం స్మరిస్తున్నాం. మీ అమూల్యమైన పాట సంపద ముందేసుకుని తరిస్తున్నాం’ |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|